ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ నియామక చట్టం 2023ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల కమిషనర్ ల సెలెక్షన్ ప్యానెల్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని మినహాయిస్తూ.. ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లను నియమించే ప్యానెల్ లో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, కేంద్రమంత్రి ఉంటారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై వాదనలను మార్చి 15న ఆలకిం చనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధ్రువీకరించారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తరుపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిందిగా కోరారు. ఈనెల 15న ఈ అంశంపై వాదనలు ఆలకిస్తామని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఓ కమిషనర్ అనూప్ పాండే గతనెల పదవీవిరమణ చేశారు. మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. త్వరలో ఎన్నికల ప్రకటన రావాల్సి ఉన్న తరుణంలో ఎన్నికల కమిషన్ లో క్లిష్టపరిస్థితి ఎదురైంది. అత్యవరంగా ఇద్దరు కమిషనర్ లను ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ లను నియమించకుండా చూడాలని సుప్రీంకోర్టుకు ఓ అపీలు దాఖలైంది. ప్రస్తుతం అదే అంశంపై 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ కోర్టుకు వచ్చింది.