పాక్- అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్ జిల్లాలో పక్తికా ప్రావిన్స్లోని ఏడు గ్రామాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులకు పాకిస్థాన్ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు చెప్పారు.
మరోవైపు ఈ చర్యను తాలిబన్ రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది. దీనికి ప్రతికారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. సరిహద్దు సమీపంలోని తాలిబన్ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడులు తామే చేశామని పాక్ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాక్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తాలిబన్ ఖండించింది. ఈక్రమంలో పాక్ వైమానిక దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.