అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. గురు, శుక్రవారాలు మంచి రోజులు కావడంతో పలు పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో కూటమి అభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావు నామినేషన్ వేశారు. ఉదయం స్థానిక టీడీపీ నాయకుడు మెట్ల రమణ బాబు ఇంటి నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వరకూ వెళ్లిన ఆనందరావు తన నామినేషన్ పత్రాలను అర్డీవో, అమలాపురం ఎన్నికల అధికారికి సమర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాని, కార్యకర్తలు కాని పాల్గొనలేదు.ఇక ముమ్మిడివరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అటు రామచంద్రపురం వైసీపీ అభ్యర్ధి పిల్లి సూర్య ప్రకాష్ తన నామినేషన్ దాఖలు చేసారు. అంతకు ముందు ఆయన ద్రాక్షరామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరుని దర్శించుకున్నారు. పిల్లి సూర్య ప్రకాష్ వెంట రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్ధులు ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు
![](https://swatantralive.com/wp-content/uploads/2024/04/tdp-2.jpg)