Site icon Swatantra Tv

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాలు

       ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక ప్రచా రంలోనూ దూకుడుగా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాలు రచి స్తోంది. ఇప్పటికే ప్రజాగళం పేరుతో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు.. వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని మరింత హోరెత్తించాలని నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబు నివాసంలో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు మూడు పార్టీల నాయకులతో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

    రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున.. ఇకపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే సభలకు బీజేపీ నుంచి కేంద్ర, రాష్ట్ర నాయకు లెవరైనా హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు, అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికపై చర్చ జరిగింది. 25 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళికతో వెళ్లాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్‌, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

     పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో సర్దుబాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్ర ప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశముంది. అనపర్తి సీటు మార్పుతో పాటు, ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు. అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున, బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళ్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా, తమ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని బీజేపీ నేతలు అన్నారు. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని తమకు విడిచి పెట్టాలని, అక్కడి నుంచి రఘురామకు టికెట్‌ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ స్థానం కేటాయించిన శ్రీనివాసవర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ తామని బీజేపీ నేతలు చెప్పారు.

Exit mobile version