స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుడు ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ పరిసరాల్లోని బారికేడ్లను నాజీ జెండా ఉన్న ట్రక్కుతో ఢీకొట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉద్దేశ పూర్వకంగానే డ్రైవింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ యువకుడిని భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా గుర్తించారు. యువకుడిని విచారించగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర కేసులు నమోదు చేశారు. సాయివర్షిత్ ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడు అనే కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.