స్వతంత్ర, వెబ్ డెస్క్: యూనివర్సిటీ ప్రాంగణంలో సిగరెట్లు తాగొద్దని చెప్పినందుకు విద్యార్థులు రెచ్చిపోయారు. నోయిడాలోని గౌతమ్ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్లోని మున్షీ ప్రేమ్ చంద్ హాస్టల్ లోపల కొందరు విద్యార్థులు ధూమపానం చేస్తున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు స్మోకింగ్ చేయవొద్దని హెచ్చరించారు. దీంతో వారి మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొన్నారు. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని.. ఘర్షణపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.