స్వతంత్ర, వెబ్ డెస్క్: పెళ్లి పీటల మీద నుంచి వధూవరులు పారిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం. తాజాగా పెళ్లి మండపం నుంచి వధువు వెళ్లిపోయిన ఘటన రాజస్థాన్లో జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వధువు కోసం వరుడు 13రోజులు మండపంలోనే ఎదురుచూడడం. పాలీ జిల్లాలోని సౌనా గ్రామానికి చెందిన మనీషాకు దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్తో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మే 4న ఉదయం వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె మేనమామ కొడుకుతో పారిపోయింది. ఎలాగో ఆమె ఆచూకీ కనిపెట్టిన బంధువులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే తాను మాత్రం పెళ్లి చేసుకోవనని ఆమె మెండికేసింది. పెళ్లి కుమారుడు మాత్రం ఏకంగా 13రోజుల వరకు పెళ్లి బట్టలతో మండపంలోనే ఎదురు చూశాడు. ఎట్టకేలకు వధువు పెళ్లికి ఒప్పుకోవడంతో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.