Alcohol Consumption in India |మందుబాబులం.. మేం మందుబాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం అని ఓ సినిమాలో పాట ఉంది. అంటే మగవారు ఎక్కువగా మందు తాగుతారనే ఉద్దేశంతో ‘మహారాజులం’ అనే పదం ఉపయోగించినట్లు ఉన్నాడు ఆ పాటల రచయిత. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నివేదిక ప్రకారం ఇక నుంచి ‘మహారాణులం’ అని కూడా జోడించాలి ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు. పండగలు, పబ్బాలు టైంలో అయితే పెగ్గు మీ పెగ్గు వేసేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రమైనా మద్యం తాగే వారు ఎక్కువగా ఉంటారు. చాలా రాష్ట్రాలు మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడుపుతున్నాయి.
అయితే ఎక్కువగా మగవారే మద్యం తాగడం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అలా అని ఆడవారు తాగరు అని కాదు. మగవారితో పోలిస్తే కాస్త తక్కువగా మహిళలు మద్యం పుచ్చుకుంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ నివేదిక ప్రకారం ప్రతి 14మంది పురుషులకు కేవలం ఒక్క మహిళ మాత్రమే మద్యం సేవిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో 0.5శాతం మంది మహిళలు, 23శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. తెలంగాణలో చూస్తే 6.7శాతం మంది మహిళలు, 43శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో కెల్లా అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 24.2శాతం మంది మహిళలు, 53శాతం మంది పురుషులు మద్యం పుచ్చుకుంటున్నారు. 16.2శాతం మంది మహిళలు, 40శాతం మంది పురుషులతో సిక్కిం రెండవ స్థానంలో ఉంది.