ఏపీలో హైఓల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర రాజకీయాలు పీక్స్కు చేరాయి. ఎన్నికల రణరంగంలో విపక్ష కూటమి, అధికార పార్టీ మధ్య అంతకుమించి అన్నట్టు సాగుతున్న మాటల దాడితో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది.
ఏపీ ఎన్నికలు పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతోంది. ఎలక్షన్కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచిన పార్టీ నేతలు…క్యాంపెయిన్లో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు సెటారికల్ డైలాగ్స్ విసురుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ పెళ్లిళ్లపై ముదురుతున్న డైలాగ్ వార్ పొలిటికల్ కాకను పెంచింది.
ఎన్నికల ప్రచారంలో బస్సుయాత్రతో దూసుకుపోతున్న సీఎం జగన్ పవన్.. విపక్ష కూటమి నేతలపై విరుచుకుపడుతు న్నారు. ఈ క్రమంలోనే కాకినాడ సభలో పవన్కల్యాణ్ టార్గెట్గా వ్యక్తిగత దూషణలకు దిగారు జగన్. ప్యాకేజి స్టార్కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఈ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానిమచ్చారు జనసేనాని. పరదాల మహారాణీ అంటూ సెటైర్ వేసిన పవన్.. లేని నా నాలుగో పెళ్లాం గురించి మాట్లాడితే… జగనే నా నాలుగో పెళ్లాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై తిరుపతి ప్రజాగళం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. పవన్కల్యాణ్తో సంసారం చెయ్.. అప్పుడైనా బుద్ది వస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నారని.. చేసుకోని నాలుగో పెళ్లి గురించి జగన్ పదే పదే మాట్లాడటంతోనే పవన్కు మండిం దని.. అందుకే తన నాలుగో పెళ్లాం జగనే అని చెప్పారని తెలిపారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా.. పవన్కల్యాణ్ గోటికి కూడా నువు సరిపోవంటూ జగన్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. పవన్ సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి..? రాజకీయాలు లేకపోతే జగన్ నయాపైసాకు పనికిరాడని.. ఏ పని చేసే సత్తా లేదని.. అలాంటి నువ్వు పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడతావా అని నిలదీశారు. ఇక టీడీపీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో ఏపీలో అంతకు మించి అన్నట్టుగా హైఓల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది.
మరోపక్క ఈ పెళ్లిళ్ల గోల ఈసీ వరకు వెళ్లింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం జగన్ తమ నాయకుడు పవన్కల్యాణ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి ముకేష్కుమార్ మీనాకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పవన్ పెళ్లిళ్లను ఆయన నియోజకవర్గాల మార్పుతో ముడిపెట్టి జగన్ ఘాటు విమర్శలు చేయడం పట్ల జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని.. తక్షణమే జగన్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని మహిళల్ని కించపరిచేలా జగన్ మాట్లాడా రని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే, రాష్ట్రం లోని మహిళల గురించి విమర్శించడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇక ఇప్పటికే వ్యక్తి గత దూషణలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఎందరో పొలిటికల్ ఎనలిస్టులు చెబుతు న్నప్పటికీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఎన్నికల క్యాంపెయిన్లో ఏదిపడితే అది మాట్లాడే లీడర్ల పై ఈసీ చర్యలు తీసుకుంటే.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు.