Site icon Swatantra Tv

నేడు నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పర్యటించడం లేదు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి కన్నుమూయడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిజామాబాద్ వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. బేగంపేట వద్ద ప్రత్యేక హెలికాప్టర్​లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి.. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు వేల్పూర్​కు వెళ్తారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. మంజులమ్మ భర్త వేముల సురేందర్‌రెడ్డి టీడీపీ హయాంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ (ప్రసుత బీఆర్ఎస్ ) రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఆయన మృతి చెందారు. మంజులమ్మకు ప్రశాంత్‌రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్‌(అజయ్‌)రెడ్డి, కుమార్తె రాధిక ఉన్నారు. మంజులమ్మ మృతిపై సీఎం సంతాపం ప్రకటించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Exit mobile version