తెలంగాణ కాంగ్రెస్లో కార్పొరేషన్ పదవులు కుంపటిని రాజేసింది. అధికారికంగా జీవో విడుదల కాకపోయినా.. పదవుల పంపకంతో కీలక నేతల మధ్య వివాదం ముదురుతోంది. తమను సంప్రదించకుండా,.. మాట మాత్రమైనా చెప్పకుండా కార్పొరేషన్లు ఎలా భర్తీ చేస్తారంటూ మినిస్టర్లు కన్నెర్ర చేస్తున్నారు. మరికొందరమే మేం సూచించిన నేతలకు పదువులు ఇవ్వకపోవడమేంటని గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఎంటా చిచ్చు..? ఎవరా నేతలు, ఎవరి మధ్య రగడ రాజుకుంది..?
పార్లమెంట్ ఎన్నికల వేళ అసెంబ్లీలో సీటు దక్కని నేతలకు.. కీలక పదువులు ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది హైకమాండ్. ఇందులో భాగంగానే కార్పొరేషన్ పోస్టులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రేవంత్ సర్కార్. అయితే,.. నియామకాల నిర్ణయమే నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారంతో ఓవైపు పార్టీలో మరోపక్క ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల మధ్య లోలోపల వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ విషయంలో తాను సూచించిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేవలం మంత్రి శ్రీధర్బాబు మనుషులకే పోస్టులు దక్కాయని.. తాను సూచించిన వారికి ఇవ్వలేదని పొన్నం తీవ్ర మనస్థాపం చెందారని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- సుడా చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నియామకంతో ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కరీంనగర్ లోక్ సభ ఇంచార్జ్గా ఉన్న తనను సంప్రదించకుండా భర్తీ చేయడమేంటని నిలదీసిన మంత్రి పొన్నం.. పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షికి ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సరైంది కాదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి సైతం ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద, ప్రకాష్ రెడ్డి, జనక్ ప్రసాద్ ఇలా అందరూ శ్రీధర్బాబు వర్గానికి చెందిన వారికే పదవులు దక్కడంపై పొన్నం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో మరో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సైతం అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. తన శాఖ పరిధిలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల విషయం కూడా తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలోని ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్గా కొల్లాపూర్కు చెందిన జగదీశ్వర్ రావును నియామకం విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్కీ సైతం కార్పొరేషన్ల నియామకం వ్యవహారంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా.. తనకు మాట మాత్రం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మధు యాష్కీ. మరోపక్క హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అన్యాయం జరిగిందంటూ మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మైనారిటీ నేతలకు పోస్టులు దక్కినా.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో MIMతో పోరాడుతున్న తమను పట్టించుకోవడం లేదని అధిష్టానంపై గుర్రగా ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో లాభం జరుగుతుందని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే.. ఆ వ్యవహారం కాస్తా నేతల మధ్య రగడకు కారణమైంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా జీవో రాకపోయినా పార్లమెంట్ ఎన్నికల కోసమే జాబితా విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదువులు వచ్చినా.. ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క పదవులు కేటాయింపుతో అసంతృప్తి వ్యవహారం మున్ముందు ఎటువైపుకు దారి తీస్తుంది..? నేతల మధ్య మరింత చిచ్చు రాజేస్తుందా అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.