Site icon Swatantra Tv

కవిత బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ విచారణ

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై రౌస్‌ అవె న్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ కేసులో మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహార్‌ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహార్‌ జైలులో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్‌ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని.. జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ రెండు బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది.

     జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్‌ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఈనెల 23న ఉదయం రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. తొలుత ఈడీ కేసులో ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ ఈనెల 23వరకు విధించగా.. ఈ నెల 11న జైల్లోనే కవితను సీబీఐ అరెస్టు చేయడం.. అనంతరం కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించడం జరిగింది. దీంతో ఈ నెల 15న కవితను మరోసారి కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది. సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు చెప్పింది. సీబీఐ, ఈడీల రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ రేపటితోనే ముగియనుంది. కవిత బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరిస్తే..రేపు ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉంది. బెయిల్‌ను ట్రయల్‌ కోర్టు తిరస్కరిస్తే కవిత పై కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.

Exit mobile version