Site icon Swatantra Tv

రేవంత్‌రెడ్డిపై హరీష్‌ రావు సంచలన ఆరోపణలు.. ఒక్కో టికెట్‌కు ఐదెకరాలు, రూ.10కోట్లు..

స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడు ఒక్కో టికెట్‌ రూ.10కోట్లు, ఐదుఎకరాల భూమికి అమ్ముకుంటున్నాడని, ఆ పార్టీ నాయకులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ములుగు, నర్సంపేటలలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలకు, మరిపెడ, తొర్రూరులో వంద పడకల ఆస్పత్రుల భవనాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గృహలక్ష్మి, దళితబంధు ప్రొసీడింగ్‌ కాపీలు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు అమలు కావని, ఆరుగురు ముఖ్యమంత్రులు మారుతారన్నారు. రాష్ట్రంలో మత కలహాలు, కొట్లాటలు సైతం జరుగుతాయని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.600 పింఛన్‌ ఇస్తుంటే, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్‌ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో మెడికల్‌ కళాశాలలు లేక విదేశాలకు వెళ్లి చదవాల్సిన దుస్థితి ఉండేదని, ఇప్పుడు డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవనుందన్నారు.

ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో ఇనుప చప్పుళ్లు, ఎన్‌కౌంటర్లు విన్నామని, ఇప్పుడు గలగల పారే నీళ్లు, ఉచిత కరెంట్‌తో పచ్చని పంటలు చూస్తున్నామని చెప్పారు. గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వకపోడానికి ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన జీఓనే కారణమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 3లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4.06లక్షల మందికి పట్టాలు ఇచ్చి, ఎనిమిది రకాల సౌకర్యాలు అందిస్తుందని చెప్పారు.

Exit mobile version