సరిగ్గా ఏబై ఏళ్ల క్రితం దేశం గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన పదం పోఖ్రాన్. మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఇరుగు పొరుగు దేశాలు యుద్ధోన్మాదాన్ని ఎగదోసిన రోజులవి. రాజ్యకాంక్షతో దేశ ఆక్రమణకుతెగబడే దేశం ఒకవైపు. ఇంకోవైపు పాకిస్తాన్ రూపంలో మరో శత్రువు. ఇలా మన దేశం చుట్టూ ఆపదలు చుట్టుముట్టిన రోజులవి. ఈ నేపథ్యంలో దేశంలో రెండువైపులా యుద్ధ మేఘాలు కమ్ముకుకున్నాయి.ఆ యుద్ధాల్లో గెలుపు ఓటములు పక్కన పెడితే, ఆ యుద్దోన్మాదం మన దేశానికి ఒక పాఠాన్ని నేర్పింది. ప్రపంచ యవనికపై మనదేశం సాంకేతిక రంగంలో సత్తా చాటేందుకు తొలి అడుగు వేసింది. మొదటిసారి అణుపరీక్ష నిర్వహించింది. ఇది జరిగి ఇప్పటికి ఐదు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఆత్మరక్షణ కోసం అణుసమృద్ధి, దేశానికి ఎంత అవసరమో గుర్తించిన నాటి పరిస్థితులను మననం చేసుకుందాం.
దాదాపు ఏబై ఏళ్ల కిందట భారత్ సరిహద్దుల్లో యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న ఇరుగు పొరుగు దేశాలకు, అణుపరీక్షతో బలమైన సందేశాన్ని పంపింది మనదేశం. ఈ అణుపరీక్షలకు మనదేశం పూనుకోవడానికి అప్పటికి బలమైన కారణాలే ఉన్నాయి. అవేమిటంటే 1962 లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే మనదేశానికి సహజ కవచ కుండలాలైన హిమాలయ పర్వత సానువుల్లోని కాశ్మీర్ కు తూర్ప భాగాన ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమిం చింది. వాస్తవానికి మావో సిద్ధాంతాల పునాదులపై నిర్మితమైన చైనా, దాని పోకడల్లో మాత్రం పెట్టుబడీ దారి వాసనలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాదాపు చైనా తన సరిహద్దుల దేశాలన్నింటితో నాటి నుండి నేటికీ అనేక వివాదాలున్నాయి. నిత్యం రాజ్యకాంక్షతో సరిహద్దు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇంకోవైపు పాకిస్తాన్ ను భారత్ పైకి ఉసిగొల్పడంలో చైనా చాపకింద నీరులా వ్యవహరించింది.ఈ క్రమంలో 1971లో భారత్, పాక్ ల మధ్య యుద్ధ చోటుచేసుకుంది. ఇదే సమయంలో అమెరికా తన విమాన వాహక నౌక యూఎస్ఎస్ ఎంటర్ ఫ్రైజ్ ను బంగాళాఖాతంలోకి పంపింది. మొత్తంగా చూస్తే అగ్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నిప్పు రాజేసి, చలికాచుకునే ధోరణికి పాల్పడ్డాయనేది స్పష్టంగా తేలిపోయింది. అయితే తొలినాళ్ల నుంచి భారత్ తో స్నేహశీలంగా ఉన్న సోవియట్ యూనియన్ భారత్ తరఫున అణు క్షిపణులు కలిగిన జలీంతర్గామిని మోహరించింది.దీంతో అమెరికా యుద్ధ నౌక అక్కడ నుంచి వైదొలగింది. ఈ పరిణామంతో అణ్వస్త్రాలు …బాలిస్టిక్ క్షిపుణుల సత్తా గురించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అవగతమైంది. మన దేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధాల కంటే ముందే అణ్వస్త్ర పరిశోధనలకు అడుగులు పడ్డాయి. హోమీ జహంగీర్ భాభా ఆధ్వర్యంలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ ను 1944లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వాతంత్ర్యానికి పూర్వమే మనదేశంలో అణుపరిశోధనలకు పునాదులు పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చాక అణు పరిశోధనలకు భారత్ తొలి ప్రధాని నెహ్రూ లాంఛనంగా అనుమతిచ్చారు. అయితే వాటిని శాంతియుత కార్యక్రమాలకే పరిమితం చేయాలని అప్పటి అధికారులకు సూచించారు.
భాభా నేతృత్వంలో అణ్వాయుధాల పరిశోధన వైపు తొలిసారిగా దేశంలో అడుగులు పడ్డాయి.సుమారు 1954 నుంచి 1959 మధ్య ఈ పరిశోధన మరింత ఊపందుకుంది. అయితే భాభా మరణంతో అణ్వస్త్ర పరిశోధన ఆగిపోతుందనుకునే తరుణంలో భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న పర్యవేక్షణలో మళ్లీ అణ్వస్త్ర పరిశోధన కొనసాగింది. నెహ్రూ అనంతరం లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాక…ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ ను అణు పరిశోధన కార్యక్రమానికి ప్రధాన కర్తగా …అధిపతిగా నియమించారు. అయితే లాల్ బహుదూర్ శాస్త్రి పూర్తిగా గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడడంతోఈ అణ్వస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ను కేవలం దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఉపయో గించాలని… సూచించారు. రాజకీయ పరిణామాల్లో భాగంగా 1966లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఢిల్లీ పీఠం ఎక్కాక దేశంలోని పలు కీలక అంశాల పట్ల సానుకూలంగా స్పందించ డంతోపాటు ప్రభుత్వ కార్యనిర్వహణలో వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర పరీక్షకు దేశాన్ని సిద్ధం చేయడానికి భాబా అణు పరిశోధన కేంద్రానికి 1972 సెప్టెంబర్ 7 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అనుమతిచ్చారు.దీంతో అణు పరీక్ష కలను సాకారం చేసే దిశగా శాస్త్రవేత్తలు రెండేళ్లపాటు నిర్విరామంగా పరిశోధనలు చేశారు .
ఈ అణ్వాయుధ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల విషయానికి వస్తే, దాదాపు 75 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. బార్క్ డైరెక్టర్ హోదాలో రాజా రామన్న. పి.కె.అయ్యంగార్ నేతృత్వంలో రాజగోపాల చిదంబరం తదితరులతోపాటు పలువురు ఇంజినీర్ల బృందం అణ్వస్త్ర పరీక్షలో పాలుపచుకుంది. అయితే ఈ బృందంలో మన దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. వీరిలో ప్రణబ్ దస్తిదార్ అణ్వాయుధ మీటను రూపొందించారు. అయితే ఈ అణుబాంబ్ లో వాడిన ఆయుధ గ్రేడ్ ఫ్లుటోనియం అభివృద్ధిలో రసాయన ఇంజినీరు హోమీ సెథ్నా కీలక పాత్ర పోషించారు. అణ్వాయుధం రూపొందించిన తర్వాత రాజస్థాన్ థార్ ఎడారిలోని పోఖ్రాన్ అణ్వస్త్ర పరీక్షకు ఎంపిక చేసుకోవండంలో నాటి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. అదేమిటంటే రేడియోథార్మికత వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేందుకు వీలైన ప్రాంతం కావడం కూడా మరో కారణం అని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఎట్టకేలకు 1974లో మే 18న ఉదయం 8.05 గం.లకు అణుపరీక్ష జరిగింది. ప్రణబ్ దస్తిదార్ మీట నొక్కి ఈ విస్ఫోటనాన్ని నిర్వహించారు. మొత్తానికి అణు పరీక్ష దిగ్విజయంగా సాగింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధా ర్మికత కనిపించలేదు. అణ్వస్త్రం విజయవంతమైన తర్వాత రాజా రామన్న అప్పటి ప్రధాని ఇందిరకు ఫోన్ చేసి అపరేషన్ స్మైలింగ్ బుద్ధా అని సంకేత నామం ద్వారా తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ కు ఆపరేషన్ స్మైలింగ్ బుద్దా అని పేరు పెట్టారు. అదే రోజు బుద్దజయంతి కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ దీన్ని పోఖ్రాన్ – 1 అని పేరు పెట్టింది. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను శాంతియుత అణువిస్ఫోటనంగా ఇందిరాగాంధీ అభివర్ణించారు.
ఒక యుద్ధం మన దేశానికి ఒ పాఠం నేర్పితే… ఒక అనుభవం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రదేశాల సరసన నిలబడేం దుకు, మన దేశానికి పోటీ తత్వాన్ని నేర్పింది. ‘స్పర్ధయా వర్ధతే విద్య’ అనే ఆర్యోక్తిమన అణ్వస్త్ర పరీక్షకు శాస్త్ర వేత్తలు చేసిన కృషికి అక్షరాల సరిపోతుంది.