స్వతంత్ర వెబ్ డెస్క్: నందమూరి తారకరామరావు శతజయంతి (మే 28)ని పురస్కరించుకుని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దివంగత సీఎంకు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. ‘నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’ అని ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్టీఆర్ జయంతి నాడు తారకరాముడితో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారితో నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. సుమారు 1980లో… ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం అంటూ కొనియాడారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్ ఘాట్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చరిత్రలో అరుదన్నారు. ఎన్టీఆర్ సినీ నటుడుగానే కాకుండా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ వేసిన మొక్కలు నేడు చెట్లు అయ్యాయని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు.