Site icon Swatantra Tv

అక్రమాలను అడ్డుకునేందుకు టీమ్ సిద్దం చేస్తున్న ఎన్నికల అధికారులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు రవాణాపై అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు సిటీలోని 15 నియోజకవర్గాలలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ లకు… GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక  శిక్షణ ఇచ్చారు.. హైదరాబాద్ ఎన్నికల అధికారులు. ఇరవై నాలుగు గంటలపాటు నిఘా ఉండేలా టీమ్‌లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కేంద్ర ఎన్నికల కమీషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి  నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఏరోజు, ఎవరిపై చర్యలు తీసుకున్నామన్న వివరాలను ఓ నివేదిక రూపంలో రోజు వారీగా అందించాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం పనిచేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ బృందాలకు GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. వారిని జి.పి.ఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలిస్తారని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు తెలిపారు.  ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరిగినా సిసి కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల సందర్భంగా పార్టీలు, వ్యక్తులు ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, నగదు లాంటివి పంచుతూ పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్  బృందాలు సంబంధిత వీడియోను తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మీటింగులు, బ్యానర్లు మొదలైన సామాగ్రిపై వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు వీడియోగ్రఫీ చేయాలని శిక్షణకు హాజరైన వారికి తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ -డి.జి.సి హైదరాబాద్ కలెక్టరేట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సెల్స్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదును సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం నగర ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే తమవెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని, 50 వేల పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు.

రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్ కంట్యాక్స్ అధికారులకు ప్లైయింగ్ స్వాడ్ టీములు సమాచారం అందించాలని శిక్షణలో తెలిపారు.  తనిఖీల సందర్బంగా అధికారులు ప్రజలతో  మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని.. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉందని వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని ఆదేశించారు. మొత్తం పదిహేను నియోజకవర్గాల కోసం మూడు షిప్ట్‌లలో ఆరువందల మందిని వినియోగిస్తున్నారు.

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులకు వంద నిమిషాల లోపు సమాధానం ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు అధికారులు. అందుకోసం ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 15 నిమిషాలలోపు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఆ ప్రదేశానికి చేరుకొని 30 నిమిషాలలోపు రిపోర్ట్‌ను ఆర్.ఓ కు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితోపాటు మరిన్ని కీలక అంశాలను సిబ్బందికి తెలిపారు అధికారులు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు.. సి-విజిల్ ఇన్వెస్టి గేటర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు ఎన్నికల అధికారులు.

Exit mobile version