Site icon Swatantra Tv

కోటప్పకొండ తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు

    పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాల్లో కోటప్పకొండ ఆలయం ఒకటి. శివ నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తూ అగస్త్య మహాముని వర్ణించారు. పావన కృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద, కొండకావురు మధ్యగల పర్వతమే ఈ శైవక్షేత్రం.

    ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు రాకతో కోటప్పకొండ శివ నామస్మరణతో మారుమోగు తుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ల 2008లో రాష్ట్ర పండుగ హోదాగా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. వేసిన పంట చేతికి రావాలని రైతులు, కోరుకున్న కోర్కెలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే వచ్చే వారు..ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే ఆలయ మహత్యం ఏ పాటిదో అర్థం అవుతోంది. అడుగడుగునా శివ నామస్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమోగుతోంది.

    ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో అన్ని శాఖలు సమన్వ యంతో పని చేయాలన్నారు అధికారులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

    భక్తులు కొండకు వచ్చి పోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహించనున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు.

    స్వామి వారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి మంచి నీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదే విధంగా చిన్న పిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం అందజేస్తున్నారన్నారు. నడకమార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు..అలాగే ఘాటు రోడ్డు నిండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలివచ్చే భక్తుల కోసం 2లక్ష 50వేల లడ్లు, లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

     ఇక మహా శివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచ హారతులు, మహా నివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామి వారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి అయిన ప్రభల తో అనేక గ్రామాల నుండి భక్తులు కోటప్ప కొండకు తరలివస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, అనేక రకాల వినోద భరిత ప్రదర్శనలతో కోటప్ప కొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు.

Exit mobile version