Site icon Swatantra Tv

కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గపోరు

  నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ వర్గపోరు అంతకంతకు ముదురుతోంది. అంతా బడా నేతలే. ఎవరికి ఎవరూ తగ్గేది లేదంటున్న నాయకులే. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది ఇందూరు కాంగ్రెస్‌ క్యాడర్‌ పరిస్థితి. ఇంతకీ ఆ బడా నేతలెవరు..? పెత్తనం కోసం పెనుగులాడుతున్న లీడర్‌ ఎవరు..? తగ్గేది లేదంటున్న నాయకులెవరు..?

     జామాబాద్‌ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట.హేమాహేమీలంతా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన భూపతిరెడ్డి కూడా పార్టీకి సీనియర్‌ నాయకులే. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే,.. దశాబ్ధి కాలంపాటు చతికిల పడ్డ కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకున్న వేళ పక్క పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్‌ నేతలంతా పెత్తనం కోసం పావులు కదుపుతున్నారు. తన మార్క్‌ను చూపించుకునే ప్రయత్నం చేస్తుండటంతో నేతల మధ్య గ్యాప్‌ పెరిగి ఆ ప్రభావం పార్టీపై పడుతుందన్న టాక్‌ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

   అధిష్టానం ఆదేశాలతో సొంత ఇలాఖా అయిన కామారెడ్డిని వదులుకున్నారు షబ్బీర్‌ అలీ. అక్కడ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో కేసీఆర్‌ నిలవడంతో.. అందుకు ధీటుగా సీఎం రేవంత్‌ కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాల వల్ల ఆ సీటును షబ్బీర్‌ అలీ త్యాగం చేయక తప్పలేదు. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో హైకమాండ్‌ అతడికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. అలాగే సీనియర్‌ లీడర్‌ అయిన సుదర్శన్‌రెడ్డి బోధన్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీని కట్టబెట్టింది అధిష్టానం. ఈ పరిణామాలే ముగ్గురి మధ్య వర్గపోరుకు దారి తీస్తున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది.

    ముగ్గురు పార్టీకి మొనగాళ్లలా ఫీలవడంతో క్యాడర్‌ ఎవరికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలో తెలియక అయోమయంతో వెనుకా ముందు అవుతోందట. అధికార కార్యక్రమాల సమయంలో ప్రోటోకాల్‌ను పాటించాలో.. సీనియారిటీ గుర్తించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. బోధన్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో కల్పించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తున్నారట.

      ఇక హైకమాండ్‌ ఆర్డర్‌ మేరకు తన స్థానాన్ని వదులుకున్న షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌ అర్బన్‌లో గుర్తింపు కోసం తహతహలాడుతున్నారట. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతిరెడ్డి తనకు ప్రాధాన్యత దక్కటం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మొరపెట్టుకున్నట్లు సమాచారం. మహేష్ కుమార్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు తన నియోజకవర్గ విషయంలో తలదూ రుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గంలో ఈ ముగ్గురి పెత్తనం ఏంటని ముఖ్యమంత్రి ముందే వాపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి ఏం చెప్పాలో తెలియక ప్రస్తుతానికి మౌనం పాటిస్తూ పరిస్థితిని దాటవేస్తోంది పార్టీ అధిష్టానం. ఇలాంటి పరిణామాల మధ్య వర్గపోరు మరింత పెరిగి మూడు ముక్కలవుతుందా…? లేదంటే హైకమాండ్‌ అలర్ట్‌ అయి పరిస్థితి ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా..? అదే జరిగితే ఎవరి ముందు ఎవరు తగ్గుతారు..? పార్టీ బాధ్యతను ఎవరి భుజాన వేసుకుంటారో చూడాలి మరి.

Exit mobile version