Site icon Swatantra Tv

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్‌

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన నరసింహన్‌, తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌.. ముగ్గురూ తమిళనాడు వారే.

Exit mobile version