సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాందీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’, ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది.
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు లక్ష సాయం వంటి హామీలపై చర్చించనుంది. 30 ఏళ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి 5 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించనుంది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన సీఈసీ.. మొదటి జాబితాలో 39 మంది, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ మరికొంత మంది అభ్యర్థులను ప్రకటించనుంది. ఇవాళ తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్ట్లో మహబూబ్నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అబ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్,.ఇక మిగిలిన అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిన్న మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. సీఈసీ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ ఇవాళ ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.