లోక్సభ ఎన్నికల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం టార్గెట్గా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సెగ్మెంట్లలో విజయం సాధించింది. మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. అలాగే 17 నియోజక వర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో నాయకులు గట్టిగా కృషి చేస్తే లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకోవడం ఏమంత కష్టంకాదన్నది బీజేపీ హస్తిన పెద్దల అభిప్రాయం.
వాస్తవానికి తెలంగాణలో బలోపేతం కావడం కోసం బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణలో కమలం పార్టీ పెరగడానికి ఎంతో అవకాశం ఉంది. అయితే పార్టీ పెరుగుదల కోసం గతం లో రాష్ట్ర నాయకత్వం పెద్దగా కృషి చేయలేదన్న విమర్శలున్నాయి. ఎంతసేపటికీ మిత్రపక్షాలతో అలయన్స్ పెట్టుకుని పోటీ చేయడానికే రాష్ట్ర నాయక త్వం ప్రయత్నించింది. అయితే తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం గత పదేళ్ల నుంచి బీజేపీ గట్టిగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ 15 శాతం నికర ఓట్ల స్థాయికి చేరింది. తెలంగాణలో బలోపేతం కావడంపై ఇటీవల బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓ వైపు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూనే మరోవైపు సంస్థాగతంగా పట్టు పెంచు కోవ డంపై కమలనాథులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్ల జాబితాలో సీనియర్లతో పాటు కొత్తవారికి కూడా చోటు కల్పించారు.
సహజంగా రాజధాని నగరంలోని పాతబస్తీ అంటే మజ్లిస్ పార్టీ అడ్డా అని అందరూ అనుకుంటారు. కాగా ఈసారి పాతబస్తీపై కూడా బీజేపీ నజర్ పెట్టింది. హైదరాబాద్ నుంచి వరుసగా ఎంపీగా ఎంపిక అవుతున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జైత్రయాత్రకు బ్రేక్ వేయాలని కమలం పార్టీ నిర్ణయిం చుకుంది. దీంతో రాజకీయాలకు కొత్త అయిన మాధవీలతను హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలి పింది. ఇదిలా ఉంటే తెలంగాణలో మొదట్నుంచీ బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీని నమ్ముకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిలో చాలా మంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయా లని తహతహలాడారు. కొన్నేళ్లుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధిష్టానం తమకు టికెట్లు ఇస్తుందని ఆశించారు. అయితే కొన్నిచోట్ల ఇలా పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు లభించలేదు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లు దక్కాయి. పార్టీలో చేరిన 24 గంటల్లో ఈ పారాషూట్ లీడర్లకు టికెట్లు దక్కడం అసలు సిసలు కార్యకర్తలకు మింగుడు పడలేదు. దీంతో పారాషూట్ లీడర్ల గెలుపునకు మొదట్నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఏమేరకు పని చేస్తారన్న ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఇదంగా టీ కప్పులో తుఫానే అంటున్నారు కమలనాథులు. పోలింగ్ తేదీ దగ్గరపడే టప్పటికీ అన్ని గొడవలు సమసిపోతాయనిబీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఏదైనా రాష్ట్రంలో బలోపేతం కావాలంటే బీజేపీకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సదరు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడం. రెండు…అలయన్స్ లకు జై కొట్టడం. తెలంగాణలో ఒంటరి పోరు చేస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం – జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కనీసం నాలుగు లోక్సభ సెగ్మెంట్లు గెలవాలన్నది కమలనాథుల లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం పక్కా ప్రణాళిక తయారు చేసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఓటమి సంగతి ఎలాగున్నా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలున్నారు. గ్రామగ్రామాన టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దీనికితోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సినీ గ్లామర్ కూడా ఉంది. ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్లో తమ అభ్యర్థుల విజయానికి కారణమవుతాయని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అయితే ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్న అసం తృప్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో ఉంది. వాస్తవానికి విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి మద్దతు ఇచ్చింది.
విభజన జరిగి పదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలా సార్లు తేల్చి చెప్పింది. అంతేకాదు విభజన చట్టంలోని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే ….అన్నీ ఇస్తాం కానీ….ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం కూడా బీజేపీకి మైనస్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్లు దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు కేంద్రం చెప్పిన కారణం ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలు రావడమే. కేవలం ఈ కారణంతోనే ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడిబజారులో అమ్మకానికి పెట్టింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై ప్రధానంగా విశాఖ నగరంపై పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యతిరేకతను తట్టుకుని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విజయం సాధించాల్సి ఉంటుంది.