ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడిపై వైసీపీ, టీడీపీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సభ సజావుగా జరకుండా అడ్డుకునేందుకు సభలో టీడీపీ సభ్యులు దాడులకు తెగబడ్డారని వైసీపీ ఎమ్మెల్యేలు అంటుంటే.. తమ సభ్యులపై అధికార వైసీపీ సభ్యులు దాడి చేశారని టీడీపీ అంటోంది. ఈ దాడి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. దేవాలయం లాంటి శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారన్నారు. తమ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి పై సుధాకర్ బాబు, ఎలీజా లు దాడి చేశారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తమ సభ్యుల స్థానాల్లోకి వచ్చి తమ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై దాడి చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ నాయకులకు పిచ్చి పరాకాష్టకు చేరిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం తమ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారన్నారు. అధికార పక్షానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన ఘటన మొత్తానికి సంబంధించిన వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసి.. తమపైనే అసత్యాలు చెబుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు వీడియో ఉంటే తమ సభ్యులపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిట్ చేయని వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. కౌరవ సభకంటే దారుణంగా అసెంబ్లీ తయారైందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు బాలవీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిలపై వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు మాదకద్రవ్యాలు తీసుకుని సభకు వచ్చారనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు మినిట్ టు మినిట్ వీడియోను విడుదల చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..