అమరావతి కేసు విచారణలో వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే ధర్మాసనాన్ని కోరారు. తమ స్టే పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలని కోరగా.. తొలికేసుగా జులై 11న విచారణకు స్వీకరిస్తామని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై స్టేను యథాతథంగా కొనసాగించాలని అమరావతి రైతులు కూడా పిటిషన్ వేశారు. దీంతో ఈ రెండు పిటిషన్లను అదే రోజున విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో.. అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల అంశం గురించి తమకు తెలియదని కేంద్రం స్పష్టం చేసింది.