Andhra Pradesh: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తమకు సంఖ్యాబలం ఉండటంతోనే ఏడుగురు అభ్యర్థులను పోటీలో నిలిపామన్నారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకపోయినా పోటీలో నిలిపారని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరిని గుర్తించామన్నారు. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లను తాము పరిగణలోకి తీసుకోలేదన్నారు. తమ పార్టీలో ఉంటూ.. నమ్మక ద్రోహం చేసిన ఇద్దరు శాసనసభ్యులను ఇప్పటికే తమకున్న మెకానిజం ఆధారంగా గుర్తించామని, సరైన సమయంలో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే చర్యలకు దిగారన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అర్థమవుతుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీటు గెలుపుతో తమ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఆపలేరన్నారు. తమ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. 175 స్థానాల్లో గెలుపుపై తాము ధీమాతో ఉన్నామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారన్నారు. డబ్బులు ఆశజూపి ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..