Polavaram |టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మరొక్కసారి విరుచుకుపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరానికి ఏం చేశారు..? అంటూ ధ్వజమెత్తారు. దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టిందని.. రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం లాంటిదని.. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీయే చెప్పారని గుర్తుచేశారు.
టీడీపీ హయాంలో పోలవరం(Polavaram) స్పిల్ వే పనులు పునాదుల స్థాయిలోనే వదిలేసి.. కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారని అన్నారు. స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలతో డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆరోపించారు. . పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీకి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే స్పిల్ వే, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి అయిందని అన్నారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని తెలిపారు. తమప్రభుత్వం పేదల ప్రజల క్షేమం కోరే ప్రభుత్వమని అన్నారు. పోలవరం అంటే వైఎస్సార్.. పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారేనని.. అది పూర్తి చేసేది ఆయన కొడుకేనని పలికారు.