Vote for not Sale: రేపు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. అయితే కొంతమంది ఓటర్లు తమ ఓటును అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లపల్లి విజయభాస్కర్.. ‘మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు’ అంటూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటును అమ్ముకొని తమ ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టలేమని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తికే ఓటు వేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సరైన అభ్యర్థికి ఓటు వేయాలని, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని విజయభాస్కర్ సూచించారు.