YS Viveka Case |మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ జరిగేకొద్ది నిందితుల జాబితాలో కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వివేకా హత్య కేసు నిందితుల జాబితాలో ఏ3గా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించిన కొమ్మా పరమేశ్వర రెడ్డితో పాటు అతడి కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పులివెందులలోని స్థానిక పాత బస్టాండు సమీపంలో పాల వ్యాపారం చేస్తున్న ఉమాశంకర్ భార్య స్వాతిని తన ఇంటి వద్ద గత శనివారం మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి అతని కొడుకు సునీల్ రెడ్డి, కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఇంటి వద్దకు వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నీ భర్త ఉమాశంకర్ రెడ్డి.. వైయస్ వివేకాను ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరమేశ్వర్ రెడ్డి తన మీద చెప్పుతో దాడికి యత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
స్వాతి ఫిర్యాదు నేపథ్యంలో కొమ్మా పరమేశ్వర రెడ్డి, కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేసి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల చేయించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు.