స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పెద్ద శుభవార్త అందించింది. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తం నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూలోటు భర్తీ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. దీంతో విడతల వారీగా కొంత మొత్తాన్ని విడుదల చేస్తూ వచ్చింది. 2014-15 కాలానికి రాష్ట్రంలో రెవెన్యూలోటును రూ.16,078 కోట్లుగా ఆర్థిక సంఘం తేల్చింది.
ఈ నేపథ్యంలో 2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు, 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3979.50 కోట్లు ఇచ్చింది. అప్పటినుంచి నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వాలు పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదు. అయితే ఈ ఏడాది మార్చిలో కేంద్రం రెవెన్యూ లోటుకు సంబంధించి రాష్ట్రం నుంచి వివరాలు కోరింది.
దీంతో అధికారులు లెక్కలతో సహా వివరాలు పంపడంతో ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద సుమారు రూ.10,461 వేల కోట్లను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అయితే ఎన్నికల ఏడాది కావడంతో పాటు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం గమనార్హం. ఏది ఏమైనా నిధులు లేక సతమతమవుతున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం పెద్దలు పెద్ద ఊరట ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.