Viveka Case |మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి సోదరుడు.. మాజీ ఎంపీ దివంగత వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐ ఈకేసు విచారణలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలకు నోటీసులివ్వగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. సోమవారం విచారణకు హాజరుకావాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి వెంటనే స్పందించారు. అయితే సోమవారం కుదరదని, తర్వాత వస్తానంటూ సీబీఐ నోటీస్కు రిప్లై ఇచ్చారు. అయితే సోమవారం కచ్చితంగా విచారణకు హాజరుకావల్సిందేనంటూ సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం విచారణకు వైఎస్.అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలోనూ వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి ఇప్పటివరకు ఆయనను రెండు సార్లు విచారణకు పిలిచింది. హత్య కేసులోని కీలక పరిణామాలపై ఆయనను లోతుగా ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్లు గూగుల్ టేకౌట్ అనే అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం చేశారు? హత్యలో పాత్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసులోని కీలక పాత్రదారులకు సీబీఐ నోటీసులు జారీ చేస్తోంది.