కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేయడంతో సీబీఐ దూకుడు పెంచే అవకాశముంది. దీంతో త్వరలోనే అవినాశ్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. కాగా వివేకా హత్య కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.