స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఐదారు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఘాట్ రోడ్డులో ఓ టెంపో వాహనం ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న టెంపో వాహనం అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టెక్ చెయ్యబోయి కొండను ఢీ కొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ప్రమాద సమయంలో టెంపోలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇటీవల జరుగుతున్న ఘాట్ రోడ్ ప్రమాదాలపై టీటీడీ అధికారులు సమీక్ష నిర్వహించారు. అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.. వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టాలని సూచించారు. కొండపైకి వెళ్లే వాహనాలు, కిందకు వచ్చే వాహనాలు నిదానంగా వెళ్లాలని సూచించారు. అయితే సమీక్ష జరిగిన వారంలోపే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.