స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. రాత్రి 7గంటలకు రైల్వే గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో సమావేశంకానున్న షా.. రాత్రికి వైజాగ్లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాలు సందర్శించిన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. కాగా ప్రధానిమంత్రిగా మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో నిర్వహించనున్న మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.