ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్న వైసీపీ అధిష్టానం 12వ జాబితాను విడుదల చేసింది. అంతకు ముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా వైసీపీ 12వ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్చార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్చార్జీగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు. దాంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీపై సందిగ్ధత తొలిగింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరుకూటి చందుని నియమించింది అధిష్టానం. అయితే చందుని మార్చాలని అధిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి తేవడంతో..అమర్నాథ్ పేరు ప్రకటించింది అధిష్టానం. మరోవైపు కర్నూలు మేయర్ గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్మను నియమిం చింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు. గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్గా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ.