Site icon Swatantra Tv

హైదరాబాద్‌లో చిన్నారి తలపైకి ఎక్కిన కారు.. పాప దుర్మరణం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో చిన్నారి ప్రాణాన్ని ఓ కారు చిదిమేసింది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా షాబాద్‌కు చెందిన రాజు, కవిత దంపతులకు ఏడేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వారు కూలీ పనులు చేసుకుంటూ బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో ఉంటున్నారు. హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీలో బాలాజీ ఆర్కేడ్‌ అపార్టుమెంటు పక్కన ఓ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేయడానికి వచ్చిన దంపతులు తమతో పాటు పాపను తీసుకువచ్చారు.

పాప నిద్రపోవడంతో పక్కనే ఉన్న అపార్టుమెంటులోని పార్కింగ్‌ స్థలంలో తల్లి పడుకోబెట్టింది. అనంతరం నిర్మాణ పనుల్లోకి వెళ్లింది. అయితే అదే అపార్టుమెంటులో నివసిస్తున్న హరిరామకృష్ణ తనకు కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో కారు పార్క్ చేస్తున్నాడు. కానీ అక్కడ పాప పడుకుని ఉండటాన్ని గమనించకపోవడంతో కారు ముందు చక్రం చిన్నారి తలపైకి ఎక్కి అక్కడికక్కడే మృతిచెందింది. పాప మృతితో ఆ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. గుండెలవిసేలా ఏడుస్తుండడం అక్కడి స్థానికులను కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version